.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

గుడిముందు ధ్వజస్తంభం ఎందుకు?

గుడిముందు ధ్వజస్తంభం ఎందుకు?
పురాణాలలో శిబిచక్రవర్తి గురించిన కథను విన్నాము. ఒక పావురాన్ని రక్షించడం కోసం తన తొడను కోసి ఇచ్చిన శిబిని గొప్ప దాతగా గుర్తిస్తారందరూ. శిబి తల్చుకుంటే తన రక్తం చిందించకుండానే ఆ పావురాన్ని రక్షించేవాడేమో! కానీ తానే త్యాగాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, తన ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు... దేనికైనా వెరువకపోవడమే శిబి చరిత్ర నేర్పే పాఠం. అలాంటి మరో పాత్రే మహాభారతంలో కూడా కనిపిస్తుంది. అదే మయూరధ్వజుడు!
మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధయాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు పాండవులు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసినా, పాండవులతో యుద్ధం చేసి నిలువలేకపోయారు. అలా ఒకో రాజ్యమూ పాండవుల పాదాక్రాంతమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే!
అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీదా, వారి ధర్మ ప్రవర్తన మీదా గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చియించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించివేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం! వారందరూ కలిసి పోరు సల్పినా కూడా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. వారి మీద పైచేయి సాధించిన తామ్రధ్వజుడు ఠీవిగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు. జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరకి చేరుకుని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదనీ... కాబట్టి అతని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించి ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురూ బ్రహ్మణవేషాలను ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ల ఎదురుగా ఉన్న విప్రులిద్దరినీ చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమసమాచారాలను తెలుసుకోగోరాడు.
రాజు వారిని కదపడమే ఆలస్యం ‘రాజా మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు! మేం ఒక అడవిగుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుడిని పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని సైతం విధించింది’ అన్నాడు విప్ర వేషంలో ఉన్న కృష్ణుడు. ‘ఆ షరతేమితో చెప్పండి! తప్పకుండా తీరుద్దాము,’ అన్నాడు మయూరధ్వజుడు. ‘మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు,’ అన్నాడు కృష్ణుడు, మయూరధ్వజుని వంక సాలోచనగా చూస్తూ. కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొణకలేదు సరికదా ‘అయ్యో! అదెంత భాగ్యం. మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోందంటే అంతకంటే ఏం కావాలి. తక్షణమే ఆ షరతుని తీరుద్దాం ఉండండి,’ అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తున్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమకంట కన్నీరు కారుతూ ఉండగాన్ని చూశాడు. వెంటనే ‘రాజా! ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా,’ అన్నాడు. దానికి మయూరధ్వజుడు ‘విప్రోత్తమా! దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడిభాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే కానీ, ఎడమభాగం ఏ ఉపయోగమూ లేకుండానే నాశనం అయిపోతోంది కదా అన్నదే నా ఆవేదన’ అన్నాడు మయూరధ్వజుడు.
మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజులు నివ్వెరబోయాడు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు.
‘మయూరధ్వజా! నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం కావాలో కోరుకో,’ అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు.
‘కృష్ణా! ఈ శరీరం నశించిపోయినా కూడా, నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించండి’ అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ‘ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందూ నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు,’ అంటూ సెలవిచ్చాడు కృష్ణపరమాత్ముడు.
ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందరా ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారిచూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తిపతాకగా నిలిచే ఆ ధ్వజస్తంభం... మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML