.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, ఆగస్టు 2019, ఆదివారం

శ్రీమద్భాగవతం - 33

శ్రీమద్భాగవతం - 33

ధ్రువోపాఖ్యానం:

భాగవతంలో ద్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. అందునా భాగవతాంర్గతంగా వినడం అనేటటు వంటిది మరింత గొప్ప విషయం. అందునా ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ద్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.
ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారే స్వాయంభువమనువు, శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు.
ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు యిన ఉత్తాన పాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి వుంది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. అపుడు సునీతి కొడుకయిన ధ్రువుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధ్రువుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అపుడు ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. “నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు”. కేవలం ఆభిజాత్యముతో ఈమాట అంటోంది. సురుచి మరల అంది “నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవు అయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిన్దములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు.” అంది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం వున్నది కాబట్టి ధ్రువుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు వుంటే నీ తండ్రి మనస్సును మరల అలా మార్చగలవాడెవడో తెలుసా! అది నీఅంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు’ అని చెప్పింది.
అపుడు పిల్లవాడయిన ధ్రువుడు ‘అమ్మా అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుడి గూర్చి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చాడు. ‘నాయనా, నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు?’ అని అడిగాడు. ‘నేను అడవికి వెళ్ళిపోతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు ధ్రువుడు. అపుడు నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. అపుడు ధ్రువుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. ఏ పెద్ద పదవిని కోరతావు’ అని నారదుడు అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను. వెడుతున్నాను’ అన్నాడు.
అపుడు నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొండుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి అంతంత కష్టాలు పడినవారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.
అపుడు ధ్రువుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. కానీ నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అంది. నా మనస్సు ఏంటో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని శ్రీహరి కనపడతాడా, కనపడడా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. అంతే! నేను వెళ్ళిపోతున్నాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి “నాయనా నీవు యమునానది ఒడ్డున నిరంతరమూ శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టు పట్టెయ్యి. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామి వారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML