ఒక నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మంత్ర శాస్త్ర రహస్యాన్ని కథారూపంగా తెలియచేశారు. ఒక వ్యక్తి ఉన్నట్లుండి రోగగ్రస్తుడై మరణశయ్యపై ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు ఆ ఊరికి వచ్చిన ఒక ధ్యాన యోగికి అతనిని చూపించారు. ఆయన ధ్యానంలో చూడగా అతనిని పీడిస్తున్న ఒక పిశాచి కన్పించింది. దానితో ఆయన మాట్లాడిన తీరును చూడండి.
యోగి : నీవెవరు? నీ వితనిని ఎందుకు పీడిస్తున్నావు ?
పిశాచి : నేను వారాహిని. ఒక దేవతను. నన్నొక మాంత్రికుడు ఇతనిని చంపమని ప్రయోగించాడు.
యోగి :వారాహి గొప్ప దేవత, ఇటువంటి నీచమైన పనులు చేయదు. నీవెవరు?
పిశాచి : 'మంత్రాధీనంతు దైవతం' అన్న మాట నీకు తెలియదా? దేవతలు మంత్రాధీనులు. మాకు మంచి చెడులతో పనిలేదు. మంత్ర సిద్ధుడు కోరిన పని చేయటం మా కర్తవ్యం.
యోగి : కావచ్చు. నిన్ను చూస్తే నీవు అసలైన వారాహివి కాదని స్ఫురిస్తున్నది. నా యోగ శక్తితో ఆజ్ఞాపిస్తున్నాను. నీవెవరు? నిజం చెప్పు.
పిశాచి : నీ యోగ శక్తి బలమైనది. నిజం చెప్తున్నా. నేను మరణించిన ఒక స్త్రీని. ప్రేతమునై శ్మశానంలో తిరుగుతున్నాను. ఒక మాంత్రికుడు అక్కడకు వచ్చి వారాహి సాధన చేశాడు. అతని మంత్ర శక్తికి నేను వశమయినాను. అత డితనిని హింసించి చంపమని ఆజ్ఞాపించాడు. అందుకే ఇలా చేస్తున్నాను. ఇంతలో మీరు వచ్చారు.
యోగి : ఇతనిని విడిచిపెట్టి వెళ్ళు. నా ఆజ్ఞ.
పిశాచి : తప్పదు కనుక వెడుతున్నాను.
తరువాత ఆరోగి వ్యాధి పోయి జీవించాడు. ఇక్కడ గమనించవలసినదేమిటంటే ఒక తీవ్ర దేవతా మంత్రాన్ని ఇంట్లోనో దేవాలయంలోనే చేస్తే ఎప్పటికో గాని సిద్ధించకపోవచ్చు. శ్మశానంలో చేస్తే ఏ భూతమో ప్రేతమో మంత్ర దేవతా రూపాన్ని ధరించి సాధకుని కోరికలు తీరుస్తుంది. అదీకాక, దివ్య క్షేత్రాల దగ్గర ఉన్న మహాశ్మశానాలలో అసలు దేవతలు కూడా రుద్ర భైరవ శక్తి మండలాలకు చెందినవారు ఉంటారు. వారు సాధకుని ధైర్యాన్ని పరీక్షించి, సిద్ధులను ప్రసాదిస్తారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి